
చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుందాం
రేగిడి: సమష్టి పోరాటంతో సంకిలి ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ పిలుపునిచ్చారు. జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటుకు రైతులంతా పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. రైతులకు అన్నివేళలా అండగా నిలుస్తామని, రైతుల హక్కులు కాపాడేందుకు పోరాటాలకు వెనుకాడబోమని స్పష్టంచేశారు. రేగిడి మండలం ఉంగరాడమెట్ట వద్ద కర్మాగారం పరిధిలోని 8 మండలాల చెరకు రైతులు మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విక్రాంత్ మాట్లాడుతూ ఈ ఏడాది చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు కర్మాగారం దృష్టిసారించకపోవడం, కొంత మంది సిబ్బందిని తొలగించడం, ప్రాంతీయ కార్యాలయాలను ఎత్తివేయడం, ప్లాంటేషన్ను నిర్వహించకపోవడం వంటి పరిస్థితులు కర్మాగారం మనుగడపై రైతుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. చక్కెర కర్మాగారం ప్రారంభ సమయం 1995లో 75వేల మెట్రిక్ టన్నులు చెరకు క్రషింగ్ జరిగేదని, అనంతరం అంచెలంచెలుగా 8 లక్షల టన్నుల క్రషింగ్ సామర్థ్యానికి పెరిగిందన్నారు. ఫ్యాక్టరీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 50వేల మంది రైతులు, ఉద్యోగులు ఆధారపడి జీవిస్తున్నారని వెల్లడించారు. అప్పట్లో రైతులకు అవసరమైన అన్ని రకాల రాయితీలను ఇవ్వడంతో పాటు భరోసా కల్పించడం వల్లే చెరకును సాగుచేసేందుకు రైతులు ఆసక్తి చూపారన్నారు. కాలక్రమేణా రాయితీలు ఎత్తేయడంతో సాగుపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లిందన్నారు. కర్మాగార యాజమాన్యం కూడా క్రషింగ్ను పక్కనపెట్టి ఇతర విభాగాలపై మొగ్గుచూపుతోందన్నారు. కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కర్మాగారం నుంచే జేఏసీ కార్యకలాపాలు సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే జేఏసీ నిర్వహణకు అవసరమైన భవన సౌకర్యం సొంతంగా కల్పిస్తామని భరోసానిచ్చారు. చెరుకు సాగు విస్తరణకు రైతులు మొగ్గుచూపాలని కోరారు. వైఎస్సార్సీపీ రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ వేలాది రైతు కుటుంబాలకు జీవనాధారమైన చక్కెర కర్మాగారాన్ని కాపాడుకునేందుకు సమష్టిగా ఉద్యమిద్దామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు టంకాల అచ్చెంనాయుడు, వావిలపల్లి జగన్మోహనరావు, రాజాం జెడ్పీటీసీ బండి నర్శింహులు, లావేటి రాజగోపాలనాయుడు, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు కరణం శ్రీనివాసరావు, కిమిడి సూరపునాయుడు, కిమిడి సీతబాబు, కెంబూరు వెంకటేశ్వరరావు, చింత సంగంనాయుడు, నారు జనార్ధనరావు, సాసుబిల్లి జగన్నాధనాయుడు, వివిధ ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.
కర్మాగారం కొనసాగకపోతే నష్టపోతాం
ప్రస్తుతం నేను 15 ఎకరాల్లో చెరకును పండిస్తున్నాను. ఈ తరుణంలో కర్మాగారం రైతులకు ప్రోత్సా హం అందించకపోతే నష్టపోతాం. కర్మాగారం కొనసాగింపును విస్మ రిస్తే ఉద్యమిస్తాం. చక్కెర కర్మాగారం కొనసాగింపునకు జేఏసీతో ప్రణాళికలు రూపొందిస్తాం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తాం. పార్టీలకు అతీతంగా నేతలను కలుస్తాం.
– నక్క శ్రీనివాసరావు,
రైతు, బొద్దాం, రాజాం మండలం
పార్టీలకు అతీతంగా రైతులు
ముందుకు రావాలి
జేఏసీ ఏర్పాటుతో యాజమాన్యంతో చర్చలకు అవకాశం
చెరకు రైతులు సమావేశంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్

చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుందాం

చక్కెర కర్మాగారాన్ని కాపాడుకుందాం