పారదర్శకంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ
మహారాణిపేట: జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో ఎన్నికల విభాగం అధికారులు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలతో నిర్వహించిన సమావేశంలో సూచనలు చేశారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు బీఎల్వోలు విధిగా క్షేత్రస్థాయిలో సందర్శించి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి.. తదుపరి ప్రక్రియలను పూర్తి చేయాలని ఆదేశించారు. సదరు వ్యక్తి సంతకంతో కూడిన ఎన్యుమరేషన్ ఫారాలు బీఎల్వోలకు తిరిగి అందజేయకుంటే ఓటరు జాబితాలో పేరు నమోదు కాదనే విషయాన్ని ఓటరుకు తెలియజేయాలని అధికారులకు, సిబ్బందికి స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి అర్హుడని, ఫారం–6తోపాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారం సమర్పించాలని కలెక్టర్ సూచించారు. మరణించిన వారు, శాశ్వతంగా వలస వెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించడం ద్వారా ఓటరు జాబితా నాణ్యతను మెరుగుపరచాలని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో బీఎల్వోలను నియమించాలని కోరారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఆర్డీవోలు శేష శైలజ, సంగీత్ మాధుర్, డిప్యూటీ కలెక్టర్ గోవింద్, ఎన్నికల డీటీ మూర్తి, జోనల్ స్పెషల్ ఆఫీసర్లు, జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు.


