పాల్పడిన ఇద్దరు మహిళలు?
అల్లిపురం: ద్వారకా బస్టాండ్లో ప్రయాణికుల్లా నటించి బస్సు ఎక్కుతూ.. ఓ ప్రయాణికురాలి బ్యాగులోంచి 13 తులాల బంగారు ఆభరణాలను ఇద్దరు మహిళలు అపహరించారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ క్రైం ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలివి. సీతమ్మధారకు చెందిన అనంతనేని స్పందన తన భర్త, కుమార్తెతో కలిసి శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో తాడేపల్లిగూడెం వెళ్లేందుకు బస్సు ఎక్కుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు వారితో పాటే ప్రయాణికుల్లా వచ్చి, బాధితురాలి హ్యాండ్బ్యాగ్లో ఉన్న 13 తులాల బంగారు ఆభరణాలను అపహరించి అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. బాధితులు బస్సులో కూర్చున్న తర్వాత బ్యాగు జిప్ తెరిచి ఉండటాన్ని గమనించి లోపల చూసుకోగా వస్తువులు కనిపించలేదు. దీంతో వెంటనే వారు అవుట్పోస్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుట్పోస్టు పోలీసులు ఈ సమాచారాన్ని టూటౌన్ క్రైం ఎస్ఐ శ్రీనివాస్కు తెలియజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ.. ఆర్టీసీ కాంప్లెక్స్లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ ఫుటేజీలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


