బ్లాక్ స్పాట్లను పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు
అల్లిపురం: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా శనివారం ఈస్ట్ సర్కిల్–1 ట్రాఫిక్ సీఐ ఎం.శ్రీను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం.బుచ్చిరాజు కలిసి తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఆర్టీసీ కాంప్లెక్స్, గొల్లలపాలెం, జగదాంబ తదితర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారు నిశితంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సమస్యను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఐ శ్రీను, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ బుచ్చిరాజు తెలిపారు. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో వాటన్నింటినీ గుర్తించి, ఆయా ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. టూటౌన్ ట్రాఫిక్ ఎస్ఐ సింహాచలం, రవాణా శాఖ అధికారులు విజయ్ కుమార్, వెంకటేశ్వరరావు, రమ్య తదితరులు పాల్గొన్నారు.


