సమస్యల పరిష్కారం కోసం హోరెత్తిన నిరసనలు
మహారాణిపేట: సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం విశాఖ జిల్లా కలెక్టరేట్ ధర్నాలు, నిరసనలతో దద్దరిల్లింది. ఉపాధ్యాయులు, కార్మికులు, మత్స్యకారులు, స్థానికులతో పాటు తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చిన దివ్యాంగులతో కలెక్టరేట్ ప్రాంగణం
కిక్కిరిసిపోయింది. వివిధ వర్గాల ప్రజలు భారీ ర్యాలీలతో తరలివచ్చి జిల్లా కలెక్టర్
ఎం.అభిషిక్త్ కిశోర్కు వినతిపత్రాలు అందజేశారు.
ఎంటీఎస్ ఉపాధ్యాయుల గర్జన
డీఎస్సీ 1998 మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) ఉపాధ్యాయులు తమ ఉద్యోగ భద్రత కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, కనీస పెన్షన్ సౌకర్యం కల్పించాలని, సమాన పనికి సమాన వేతనంతో పాటు రెగ్యులర్ ఉపాధ్యాయుల వలె అన్ని అలవెన్సులు వర్తింపజేయాలని అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
హార్బర్ కార్మికులను ఆందోళన
ఇక ఫిషింగ్ హార్బర్ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వేట సామగ్రి నిల్వకు సదుపాయాలు, విశ్రాంతి గదులు, డీజిల్ సబ్సిడీ, ప్రమాద బీమా, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) నాయకుడు పి.చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
అదానీ పోర్టు కాలుష్యంపై పోరు
గంగవరం అదానీ పోర్టు వల్ల కలుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలని గ్రామస్తులు నిరసన చేపట్టారు. కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ఐక్యవేదిక నేత కంబాల రాజు కోరారు. అవసరమైతే గంగవరం పరిధిలోని నాలుగు గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.


