కొమ్మాది: ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’కార్యక్రమంలో భాగంగా నిరంతరం శ్రమిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులను సత్కరించడమే స్వచ్ఛ సర్వేక్షణ్ మిషన్ ప్రధాన ఉద్దేశం. అయితే, శనివారం ఎండాడ ఆర్ఆర్ఆర్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో దీనికి విరుద్ధంగా శానిటరీ సూపర్వైజర్లను సత్కరించడంపై కార్మికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, ఎస్.ఎస్.వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన కల్పించారు. అనంతరం సన్మాన కార్యక్రమం చేపట్టారు. వాస్తవానికి రేయింబవళ్లు కష్టపడుతున్న కార్మికులను సత్కరించాల్సి ఉండగా, ఒక ఉన్నతాధికారి మెప్పు కోసం సూపర్వైజర్లకు ప్రాధాన్యం ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సత్కారం పొందిన వారిలో విధి నిర్వహణలో అలసత్వం వహించే వారు, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేసే వారు, తమ వద్ద డబ్బులు వసూలు చేసే వారు ఉన్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
మాకు తెలియకుండానే జరిగింది
దీనిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మిని వివరణ కోరగా.. ఈ కార్యక్రమంలో కార్మికులను మాత్రమే సత్కరించాలని తాము ఆదేశించామని తెలిపారు. తమకు తెలియకుండానే సూపర్వైజర్లను వర్కర్ల స్థానంలో కూర్చోబెట్టి సన్మానం చేశారని ఆమె వివరణ ఇచ్చారు.
అధికారుల తీరుపై పారిశుధ్య కార్మికుల ఆగ్రహం


