గోపాలపట్నం: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఎలైట్ స్పా సెంటర్ను ఎట్టకేలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాలివి.. ఎన్ఏడీ జంక్షన్ విల్లా కాంప్లెక్స్లో నిర్వహిస్తున్న ఎలైట్ వెల్నెస్ అండ్ స్పా సెంటర్పై ఆరు నెలల కిందట టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి విటులను, మహిళలను పట్టుకున్నారు. ఆ తర్వాత దీన్ని సీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ, అధికారుల మధ్య సమన్వయ లోపంతో నిర్లక్ష్యంగా వదిలేశారు. అయితే, రెండు నెలల తర్వాత మారు తాళాలతో తిరిగి స్పాను తెరిచి వ్యాపారం చేస్తుండటాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. మరమ్మతులు చేసేందుకే తాళాలు తీశామంటూ నిర్వాహకులు వారిని నమ్మబలికారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. సాక్షిలో ‘స్పా..ందించండి’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం ఆ స్పా సెంటర్ను సీజ్ చేశారు. ఎస్ఐ ప్రసాద్, ఆర్.కోమలి, తదితరులు పాల్గొన్నారు. అలాగే జ్యోతినగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఒక ఇంటిని కూడా పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గతేడాది డిసెంబర్లో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. తాజాగా స్పందించిన అధికారులు ఆ ఇంటికి కూడా మంగళవారం సీల్ వేశారు.
ఎలైట్ స్పా సెంటర్ సీజ్


