ఏయూక్యాంపస్: ప్రజల ఆరోగ్యానికి ప్రతీకగా, యోగాకు విశిష్ట గుర్తింపుగా యోగాంధ్ర మెమోరియల్ నిలుస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. బీచ్ రోడ్లోని యోగా విలేజ్ వద్ద నూతనంగా నిర్మించిన యోగాంధ్ర మెమోరియల్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ప్రధానమంత్రి సందర్శించిన ఈ ప్రాంతానికి గుర్తుగా, ఆరోగ్య ప్రాధాన్యతను చాటిచెప్పేలా ఈ యోగా చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా.. జీవీఎంసీ ఆధ్వర్యంలో యోగా విలేజ్ సమీపంలో సుమారు రూ.69.55 లక్షల అంచనా వ్యయంతో ఈ మెమోరియల్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పింక్ శాండ్స్టోన్తో మెమోరియల్ నిర్మాణంతో పాటు ఆకట్టుకునేలా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మనాభం ప్రాంతానికి చెందిన ఓ యోగా క్రీడాకారిణి ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జీవీఎంసీ ఏడీసీలు రమణ మూర్తి, సత్యవేణి పాల్గొన్నారు.


