సాక్షి,విశాఖ: పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంలో భారత్లో పెట్రోల్, డీజిల్తో పాటు ఇతర సహజ వనరుల కొరత ఏర్పడింది. ఆ కొరతను తగ్గించేలా కేంద్రం వడివడిగా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో రష్యా నుంచి ఎల్పీజీ గ్యాస్ను భారీ ఎత్తున కొనుగోలు చేసింది. గ్యాస్ నౌకలు రష్యా నుంచి విశాఖ పోర్టుకు వస్తున్నాయి.
ఇటీవలే రష్యా నుంచి బయలుదేరిన భారీ క్రూడాయిల్ నౌక ‘ఎంటీ జంబో’ విశాఖ పోర్టుకు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నౌకలో మొత్తం 1,36,728 మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ ఉంది. పోర్టు అధికారులు నౌకను బెర్త్కు చేర్చి, నేటి నుంచే అన్లోడింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సరుకు రాకతో తూర్పు తీరంలోని రిఫైనరీలకు అవసరమైన ముడి చమురు సరఫరా స్థిరంగా ఉంటుంది.

ఎంటీ జంబో రాకతో విశాఖపట్నం తీరంలో ఇంధన సరఫరా సమస్యలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు నడుమ విశాఖ పోర్టుకు వరుసగా ముడిచమురు, ఎల్పీజీ నౌకలు చేరుకోవడం ఊరట కలిగినట్లైంది.
ఇటీవల వైజాగ్ పోర్టుకు BW Birch అనే ఎల్పీజీ నౌక చేరుకుంది. ఈ నౌకలో 24వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. నౌక నుంచి గ్యాస్ ట్రాన్స్షిప్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. గ్యాస్ కొరతతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో వరుసగా గ్యాస్,ముడిచమురు నౌకలు రావడం ఊరట కలిగించినట్లైంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సమస్యలు తలెత్తుతాయన్న భయాలు నెలకొన్నాయి. అయితే విశాఖ పోర్టుకు వరుసగా ముడి చమురు, ఎల్పీజీ నౌకలు చేరుకోవడం వల్ల ఆందోళనలు తగ్గుతున్నాయి. పోర్టు అధికారులు కూడా రాబోయే వారాల్లో మరిన్ని క్రూడ్ ఆయిల్ నౌకలు రానున్నాయని వెల్లడించారు.


