మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏప్రిల్ 6 నుంచి 8వ తేదీ వరకు మెగా కల్చరల్ ఫెస్ట్–2026 నిర్వహించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ తెలిపారు. శనివారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్, టీజర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఈ మెగా కల్చరల్ ఫెస్ట్లో మ్యూజికల్ నైట్, సైక్లింగ్, వాక్థాన్, డ్రోన్ షో, లేజర్ షో, డీజే నైట్, సాంస్కృతిక కార్యక్రమాలు, టాలెంట్ షో, ఫ్లవర్ షో వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఏయూతో పాటు అనుబంధ కళాశాలల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. వచ్చే నెలలో జరగనున్న శతాబ్ది మహోత్సవాలకు ముందు నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల వివరాలతో రూపొందించిన శతాబ్ది మహోత్సవ్ వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఈ వెబ్సైట్ను పూర్తిగా ఏయూ విద్యార్థులే రూపొందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఆచార్య ఎం.శశి, ఎం.వి.ఆర్. రాజు, కె.సీతామాణిక్యం, ఆచార్య ఎన్.విజయమోహన్, ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య సిహెచ్.ఆశా ఇమ్మానియల్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమ వివరాలు
ఏప్రిల్ 6న భీమిలి వరకు సైక్లింగ్, ట్రీ ప్లాంటేషన్, లైవ్ మ్యూజిక్ బ్యాండ్, సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ కన్సర్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న రంగోలి పోటీలు, ఉత్తరాంధ్ర గాయకులతో ప్రత్యేక పాత పాటల కార్యక్రమం, థింసా నృత్యం, విద్యార్థుల ప్రదర్శనలు, శాసీ్త్రయ నృత్యాలు జరుగుతాయి. ఏప్రిల్ 8న వాక్థాన్, రక్తదాన శిబిరం, సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో, డీజే నైట్ నిర్వహిస్తారు.


