పెదగంట్యాడ : కల్లు గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా యాత సంఘం అధ్యక్షుడు అండిబోయిన అప్పారావు నేతృత్వంలో సోమవారం జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత వృత్తిలో ఉండి ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన కార్మికులకు ‘ఎన్టీఆర్ భరోసా’తో పాటు ఎక్స్గ్రేషియా అందజేయాలని కోరారు. తీవ్రంగా గాయపడిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే ఉపాధి ఉండే ఈ వృత్తిలో ఉన్నవారిని మిగిలిన ఆరు నెలల కాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని, తాటి ఉత్పత్తులతో పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కల్లు గీత వృత్తికి ఒక సమగ్ర చట్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో యాత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అండిబోయిన లక్ష్మి, బాడితబోయిన రాములప్పడు తదితరులు పాల్గొన్నారు.


