సింహాచలం : సింహగిరిపై డిసెంబరు 30న ముక్కోటి ఏకాదశి(వైకుంఠ ఏకాదశి) ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ముక్కోటి ఏకాదశికి చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం దేవస్థానం వైదికులు, ఇంజనీరింగ్ అధికారులు, పలు విభాగాల సెక్షన్ హెడ్లతో ఇన్చార్జి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది స్వామివారి ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పెద్ద ఎత్తున క్యూలు, భక్తులందరికి ఉచితంగా ప్రసాద వితరణ, అన్నప్రసాద విభాగంలో పొంగలి, పులుసు ప్రసాదం ఉంటాయన్నారు. పెద్ద ఎత్తున విద్యుద్దీపాలంకరణ చేస్తామన్నారు. వలంటీర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించేందుకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో రాధ, ఈఈ రమణ, ఏఈవోలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.


