
నకిలీ బాస్?
రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అండతో పావులు కదుపుతున్న అధికారి గతంలో ఫేక్ డిగ్రీలతో పాటు సామాజిక వర్గాన్ని మార్చేశారనే ఆరోపణలు సంస్థ నష్టాలకూ కారణమయ్యారని దిగువ స్థాయి కేడర్కి డిమోషన్ అదే కుర్చీ కోసం రూ.లక్షలు ముట్టజెప్పేందుకు కేంద్ర మంత్రితో డీల్.! ఆధారాలతో సహా సీబీఐకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగులు
డ్రెడ్జింగ్కి మళ్లీ
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కార్యాలయం
సాక్షి, విశాఖపట్నం : నష్టాల బాటలో పయనిస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ను గట్టెక్కించేందుకు చర్యలు తీసుకోవాల్సిన బోర్డు.. చేసిన తప్పునే మళ్లీ చేస్తోంది. సంస్థలో కీలకమైన పోస్టు ఎంపికలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గతంలో నకిలీ సర్టిఫికెట్లతో ఎండీగా, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జీవైవీ విక్టర్.. సంస్థను కోట్ల రూపాయలకు పైగా నష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేశారు. నిండా మునిగిన తర్వాత తేరుకున్న ఉన్నతాధికారులు ఆయన్ని విధుల నుంచి తప్పించారు. తర్వాత జరిగిన ప్రధాన నియామకం కూడా అదేరీతిలో మారి వివాదాస్పదమైంది. సదరు వ్యక్తి 1987లో ఎస్సీ కోటా స్పెషల్ డ్రైవ్లో షిప్లో డెక్ కేడెట్గా డ్రెడ్జింగ్ కార్పొరేషన్లో చేరారు. 2009లో డీజీఎంగా పదోన్నతి పొంది.. పట్టుమని పది నెలలైనా పని చెయ్యకుండా డీసీఐకు రాజీనామా చేసేశారు. డీసీఐ ప్రత్యర్థి సంస్థగా చెప్పుకునే మెర్కటర్ సంస్థలో డీజీఎం ఆపరేషన్స్గా జాయిన్ అయ్యారు. రెండున్నరేళ్లు పనిచేసి తిరిగి 2012లో డీసీఐకి వచ్చేశారు. ఈ సమయంలో డీసీఐలో తిరిగి చేరినప్పుడు విద్యార్హతలకు సంబంధించిన నకిలీ ధృవపత్రాలను సమర్పించినా ఆయనకు కీలక బాధ్యతలు కట్టబెట్టేశారు.
అర్హతలన్నీ అబద్ధాలే..!
గతంలో కీలక బాధ్యతల పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అందులో హిందూగా పేర్కొన్నారు. ఆ సమయంలోనే సదరు అధికారి నగరంలోని యూనియన్చాపల్ బాప్టిస్ట్ చర్చ్కి వైస్ చైర్మన్గా ఉన్నారు. క్రిస్టియన్గా ఉంటూ ఉద్యోగం కోసం చేసిన దరఖాస్తులో మాత్రం హిందూగా పేర్కొన్నారని ఆరోపణలు మొదలుకొని.. బీకామ్ డిగ్రీతో పాటు డ్రెడ్జ్ గ్రేడ్ మాస్టర్–1 అర్హతలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. డిగ్రీ సర్టిఫికెట్ నకిలీదని గుర్తించారు. అంటే కేవలం ఇంటర్ విద్యార్హత ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోబెట్టారన్న ఆరోపణలతో డీసీఐ అట్టుడికిపోయింది. ఈయన వ్యవహారశైలి, తప్పుడు ధృవపత్రాల అంశాలపై గతంలో సీబీఐకి ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన బోర్డు డిమోషన్ చేసి సీజీఎంగా బాధ్యతలు అప్పగించింది.
కేంద్ర మంత్రి సిఫార్సుతో మరోసారి..!
సీజీఎంగా ఉన్న సదరు అధికారికి సింహాసనంపైనే దృష్టి ఉండేది. ఆ కుర్చీ కోసం ఇన్చార్జ్గా నియమించిన ఉన్నతాధికారిని పక్కనపెట్టేసి.. అన్నీ తానై డ్రెడ్జింగ్లో చక్రం తిప్పేవారు. ఇప్పుడు కూటమి పార్టీకి చెందిన ఓ కేంద్ర మంత్రితో రికమెండేషన్ కోసం డీల్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. దీనివెనుక రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు డీసీఐలో వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి సిఫార్సులకు బోర్డు కూడా తలొగ్గినట్లు తెలుస్తోంది. త్వరలోనే సదరు వ్యక్తిని కీలకు కుర్చీలో కూర్చోబెట్టేందుకు ఆర్డర్లు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గతంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు, సామాజికవర్గం విషయంలోనూ తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తికి మళ్లీ అవే బాధ్యతలు కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ పోర్టులో ఇటీవల బదిలీ అయిన వ్యక్తుల ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. మరోసారి ‘నకిలీ’ అధికారికి డ్రెడ్జింగ్లో కీలకబాధ్యతలు అప్పగిస్తే.. సంస్థ నష్టాలతో మరింత దిగజారిపోతుందన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. సదరు ‘నకిలీ’ ఉన్నతాధికారి.. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి రాజీనామా చేసి.. మెర్కటర్లో చేరిన తర్వాత.. డీసీఐకి నష్టం వాటిల్లేలా వ్యవహరించినట్లు కూడా సీబీఐకి కొందరు ఉద్యోగులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతి విషయంలోనూ సదరు అధికారికి సంబంధించిన నియామకం వెనుక ఉన్న అక్రమాల జాబితాని జత చేర్చుతూ.. కేంద్ర పోర్టులు మంత్రిత్వ శాఖతో పాటు సీబీఐకి మరోసారి ఫిర్యాదు చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ‘నకిలీ’ నియామకానికి సహకరిస్తున్న పోర్టు అధికారులపైనా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
అక్రమాల పుట్టగా మారిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ మరోసారి వివాదాస్పద నియామకానికి
సిద్ధమవుతోంది. నకిలీ ధృవపత్రాలతో గతంలో ఉన్నత హోదాలో కూర్చోబెట్టి.. తర్వాత
విధుల నుంచి తప్పించిన బోర్డు.. ఇప్పుడు మళ్లీ సంస్థలో అదే వ్యక్తికి కీలక బాధ్యతలు
అప్పగించేందుకు చూస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలో కీలకమైన పోస్టు నియామకంలో గుడ్డిగా
వ్యవహరించడం వెనక కూటమి ఎంపీ సిఫార్సు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగానే డబ్బులు
చేతులు మారాయనీ.. అందుకే సదరు అనర్హుడైన ‘నకిలీ’ ఉన్నతాధికారిని మరోసారి
సింహాసనంపై కూర్చోబెట్టేందుకు అంతా సిద్ధం చేసినట్లు సమాచారం.