
కార్మిక ఒప్పందాలు అమలు చేయాలి
బీచ్రోడ్డు: గతంలో కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందాలను విద్యుత్ సంస్థల యాజమాన్యం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు(ఏపీఎస్పీఈ) నిరసన చేపట్టారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీఈ డిస్కం యూనిట్ చైర్మన్ గణపతి మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిస్థితులను, సమస్యలను ఇప్పటికే విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు, రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో శాంతియుత ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. జూనియర్ లైన్మన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంట్) కు కొత్త సర్వీసు నిబంధనలను రద్దు చేసి, పాత నిబంధనలు వర్తింపజేసి పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైన్మన్ పోస్టుల్లో జూనియర్ లైన్మన్ గ్రేడ్–2లకు వెంటనే పదోన్నతి కల్పించాలని కోరారు. 1999 నుంచి 2004 వరకు నియమించిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని, కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ప్రకారం నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు కరువు భత్యం వాయిదాలను వెంటనే విడుదల చేయాలని నగదు రహిత అపరిమిత వైద్య సౌకర్యాన్ని అందుబాటులోకి తేవాలన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న అభద్రతాభావాన్ని తొలగించి, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు కోరారు.
విద్యుత్ ఉద్యోగుల నిరసన

కార్మిక ఒప్పందాలు అమలు చేయాలి