
టీడీఆర్ బాండ్లు వద్దే వద్దు..
సాక్షి, అనకాపల్లి:
అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ బాధితులు కదంతొక్కారు. నష్టపరిహారాన్ని టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలోనే అందించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయం ఎదుట బుధవారం నిరసనకు దిగారు. ఇళ్లు, దుకాణాలు, భూములకు ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలని నినదించారు. అనంతరం రోడ్డు విస్తరణ నిర్వాసితుల సంఘం కన్వీనర్ ఆర్.రాము ఆధ్వర్యంలో నిర్వాసితులు వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్కు వినతిపత్రం అందజేశారు. గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో టీడీఆర్ బాండ్లు వద్దని నిర్వాసితులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించారని, అయినా టీడీఆర్ బాండ్లే ఇస్తామని అధికారులు పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ వాపోయారు. మరోవైపు మూడు రోజుల క్రితం అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలంటూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయడంపై మండిపడ్డారు. నిర్వాసితులంతా పేదవారని, వారికి టీడీఆర్ బాండ్లు ఏమాత్రం ఉపయోగపడవని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగదు రూపంలో నష్ట పరిహారం అందించి, తమకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వమే ఉపాధి కల్పించాలన్నారు. 100 అడుగుల తర్వాత నిర్మించుకునే ఇళ్లకు ఎటువంటి నిబంధనలు విధించరాదన్నారు.
మూడు నియోజకవర్గాలు..
1225 మంది బాధితులు
అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణ కోసం మూడు నియోజకవర్గాల పరిధిలో 125 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ భూముల్లో దాదాపుగా 1225 మంది నిర్వాసితులున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి మాన్యంలో ఉన్న 12 మంది నిర్వాసితులకు, ఆర్అండ్బీ, పీడబ్ల్యూ స్థలాల్లో ఉన్న 62 మంది నిర్వాసితులకు బలవంతంగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. మిగిలిన నిర్వాసితులెవ్వరూ టీడీఆర్ బాండ్లు తీసుకోకుండా వ్యతిరేకించారు.
కమిషనర్కు వినతి ఇస్తే.. సమాధానమే లేదు
మాకు టీడీఆర్ బాండ్లు వద్దు.. నష్ట పరిహారంగా నగదు ఇవ్వాలి. 2023లో గ్రామాల వారీగా ధర నిర్ణయించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నష్ట పరిహారం ఇవ్వడానికి అంతా సిద్ధం చేశారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ జీవో రద్దు చేశారు. గత నెల 31న టీడీఆర్ బాండ్లు ఇస్తామంటూ జీవో ఇచ్చారు. వీఎంఆర్డీఏ కమిషనర్ను కలిసి టీడీఆర్ బాండ్లు వద్దు అని కోరాం. మాకు సంబంధం లేదని సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.
– కర్రి అప్పారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, తిమ్మరాజు పేట, అచ్యుతాపురం మండలం

టీడీఆర్ బాండ్లు వద్దే వద్దు..