
మారుమూల ప్రాంతాలకు వెళ్లాలని ఒత్తిడి
రెండో రోజు కొనసాగిన ఎంటీఎస్ టీచర్ల నిరసన
బీచ్రోడ్డు: దూర ప్రాంతాలకు, రవాణా సౌకర్యం లేని మారుమూల పాఠశాలలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం తమపై ఒత్తిడి తెస్తోందని 1998, 2008 ఎంటీఎస్ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీ కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన ఖాళీలను తమతో భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారని తెలిపారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రెండో రోజైన మంగళవారం తమ నిరసనను కొనసాగించారు. మారుమూల పాఠశాలలను ఎంచుకోవాలని ఒత్తిడి చేయడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. తమలో చాలా మంది 55 ఏళ్లు పైబడిన వారని, 70 శాతం మంది మహిళలే ఉన్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏజెన్సీ ప్రాంతాలకు పంపి పని చేయాలనడం బాధాకరమని వాపోయారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 32 వేల వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ.. మారుమూల ప్రాంతాల్లో పనిచేయడం తమ శక్తికి మించిన భారం అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఆర్.సి.నంబర్ 39 ఉత్తర్వుల ప్రకారం తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో పోస్టింగ్ ఇవ్వాలని లేదా మైదాన ప్రాంతాల్లోని ఏకోపాధ్యాయ పాఠశాలలో రెండవ ఉపాధ్యాయునిగా నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం మొత్తం మీద విశాఖ పరిస్థితి ప్రత్యేకమైనదని, తమకు తగిన న్యాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.