
మరణించి.. మరో ఇద్దరికి వెలుగునిచ్చి..
పెందుర్తి: మరణంలోనూ ఓ ‘అమ్మ’ఇద్దరికి కంటి వెలుగునిచ్చింది. పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన బీశెట్టి కనకమ్మ(52) అక్కయ్యపాలెం రైతుబజార్లో ఆకుకూరలు విక్రయిస్తుంటుంది. మంగళవారం ఉదయం రైతుబజార్కు వెళ్లిన కనకమ్మకు గుండెపోటు వచ్చింది. వెంటనే తోటి రైతులు స్పందించి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం మరణించింది. కనకమ్మ మృతదేహాన్ని చింతలగ్రహారానికి తరలించారు. ఈ క్రమంలో మృతురాలి బంధువు సంతోష్ ద్వారా సమాచారం అందుకున్న పెందుర్తి సాయి హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకుడు దాడి శ్రీనివాస్ కనకమ్మ కుమారులు జగదీష్, ఈశ్వరరావులను నేత్రదానానికి ఒప్పించారు. వారు అంగీకారం తెలపడంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చెందిన మొహిషిన్ ఐ బ్యాంక్ ప్రతినిధులు కనకమ్మ కార్నియాలను సేకరించారు. తల్లి మృతి చెందిన దుఃఖంలోనూ కుమారులు ఇద్దరూ చూపిన మానవత్వానికి గ్రామస్తులు ప్రశంసించారు.