
ఏయూలో ఆస్ట్రేలియా కార్నర్?
మద్దిలపాలెం: యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి.రాజశేఖర్తో వారు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి ఇంజినీరింగ్ కోర్సులను సంయుక్తంగా నిర్వహించడంపై ప్రాథమిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఏయూ ప్రాంగణంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా కార్నర్ ఏర్పాటు చేసే దిశగా కూడా చర్చలు సాగాయి. సంయుక్త కోర్సుల నిర్వహణకు అవసరమైన విధివిధానాలు, నియమావళిని రూపొందించిన తర్వాత మరోసారి చర్చలు జరపాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనుంజయ్రావు, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా గ్లోబల్ గ్రోత్ అండ్ అడ్వకసీ విభాగం డైరెక్టర్ నషీద్ చౌదరి, గ్లోబల్ ఎంగేజ్మెంట్ మేనేజర్ బ్రోడెరిక్ మైకోప్, ఏయూ ఆర్ అండ్ డీ విభాగం డీన్ ఆచార్య వి.వల్లికుమారి, ఆచార్య డి.లలిత భాస్కర్ పాల్గొన్నారు.