
ఆధునిక విధానాలతో విపత్తుల నిర్వహణ
మహారాణిపేట: ‘ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి. భవిష్యత్ అవసరాలు, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పాత విధానాలను నవీకరించాలి.’ అని జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) ప్రతినిధులు నావల్ ప్రకాష్, అభిషేక్ బిశ్వాస్, అభినవ్ వాలియా అభిప్రాయపడ్డారు. క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం కోసం విశాఖకు విచ్చేసిన వీరు.. ముందుగా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ను తన చాంబర్లో కలిశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా సమగ్ర ప్రణాళికలు, విపత్తుల నిర్వహణలో అంతర్ జిల్లాల సహకారం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. విపత్తుల నిర్వహణలో జపాన్ అనుసరించిన సాండియా ఫ్రేమ్వర్క్, ప్రధాన మంత్రి పది సూత్రాల అజెండా, డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్లో అనుసరించాల్సిన విధానాలపై సమీక్షించారు. ఎన్డీఎంఏ రూపొందించిన పీపీటీని ప్రజెంట్ చేసి, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ నిబంధనలను వివరించారు. ఈ సందర్భంగా సంస్థ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ మాట్లాడుతూ జిల్లా ప్రణాళికలను ఆధునికీకరించాలని సూచించారు. విపత్తుల నిర్వహణలో సాచేత్ యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ వ్యవస్థలను వినియోగించుకోవాలని చెప్పారు. ప్రమాదాలు సంభవించినప్పుడు అంతర్ జిల్లాలు పరస్పరం సహకరించుకోవాలని హితవు పలికారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను సందర్శించాలని, భవిష్యత్తు కార్యాచరణ, ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. సాచేత్ యాప్ను వినియోగించడం ద్వారా ప్రమాద హెచ్చరికలను మెసేజ్ల రూపంలో పొందవచ్చన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉండే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బెటాలియన్ల సంఖ్యను పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. దేశంలోనే మొదటిగా జాతీయ సైక్లోన్ మిటిగేషన్ కేంద్రాన్ని ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో నెలకొల్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖ లాంటి ప్రాంతంలో అన్ని రకాల విపత్తులు సంభవించడానికి ఆస్కారం ఉందని, అన్ని రకాలుగా ప్రణాళికలు రూపొందించుకొని సన్నద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ సమావేశంలో ఎస్డీఎంఏ ప్రతినిధి సీహెచ్ పీటర్, డీపీఎం రాము, సివిల్ డిఫెన్స్ అధికారి మధుసూదన్ రావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.