
రేపటి నుంచి కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ సెమినార్
డాబాగార్డెన్స్: విశాఖలో ఈనెల 27 నుంచి 29 వరకు కనెక్ట్ ఏపీ ఎక్స్పో టెక్ 4వ సెమినార్ నిర్వహించనున్నట్టు నిర్వాహకుడు బండారు కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో సెమినార్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాసన్స్ బే కాలనీ గాదిరాజు ప్యాలెస్లో జరగనున్న ఈ సెమినార్ను కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, డిజిటల్ మార్కెటింగ్ ప్రతినిధులు, డిజిటల్ సాంకేతిక రంగ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఇది మంచి వేదిక కానుందన్నారు. ప్రపంచ దేశాల్లో మారుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించి, ప్రతి ఒక్క పరికరం వినియోగదారులకు ఈ ఎక్స్పోలో లభ్యం కానుందని, ప్రముఖ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాయన్నారు. సమావేశంలో కేబుల్ ఆపరేటర్లు సుభద్రరాజు, గుంటూరు ప్రసాద్, చింతాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.