
కొనసాగుతున్న పాలిసెట్ కౌన్సెలింగ్
మురళీనగర్: పాలిటెక్నిక్ కళాశాలల్లో సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి బుధవారం కూడా పాలిసెట్ కౌన్సెలింగ్ జరిగింది. వర్షం పడుతున్నప్పటికీ.. ఇబ్బందులు పడుతూనే విద్యార్థులు అత్యధిక సంఖ్యలో కౌన్సెలింగ్కు హాజరయ్యారు.
● గైస్ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటరమణ పర్యవేక్షణలో, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ సీహెచ్ జయప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో 68,001 నుంచి 77,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 250 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు.
● పాలిటెక్నిక్ కళాశాలలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్నకుమార్ పర్యవేక్షణలో, జనరల్ హెడ్, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ డాక్టర్ పీఎం భాషా, లెక్చరర్ నాగరాజుతో కూడిన అధికారుల బృందం 77,001 నుంచి 86,000 ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహించింది. 298 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించింది. వీరిలో 209 మంది బీసీ, 37 మంది ఓసీ, 39 మంది ఎస్సీ, 13 మంది ఎస్టీ విద్యార్థులు ఉన్నారు.
● గురువారం గైస్ కళాశాలలో 86,001 నుంచి 95, 000 ర్యాంకు వరకు, పాలిటెక్నిక్ కళాశాలలో 95,001 నుంచి 1,04,000 ర్యాంకు వరకు విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాల్సి ఉంటుంది. ఎస్టీ విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలకు హాజరు కావాలి.
వెబ్ ఆప్షన్ల ఎంపిక వాయిదా
పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్ ఆప్షన్ల ఎంపిక వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 27 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కావాల్సి ఉంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 వరకు వెబ్ ఆప్షన్లు నిర్వహించి, జూలై 1న ఆప్షన్ల మార్పిడి, 3న సీట్ల కేటాయింపు జరగాల్సి ఉంది. అయితే ఆప్షన్ల ఎంపికను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఇందుకు సంబంధించి ర్యాంకుల వారీగా కొత్త షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది.