
జనసేన నాయకుల నుంచి కాపాడండి
● అధికార బలంతో తమ ప్లాట్లను దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారు
● తాము ఎమ్మెల్యే పంచకర్ల మనుషులం అంటూ బెదిరిస్తున్నారు
● పెదగాడిలో జనచైతన్య ప్లాట్ల ఓనర్ల అసోసియేషన్
ప్రతినిధుల వేడుకోలు
పెందుర్తి: ‘మేం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు తాలూకా.. ఈ ప్లాట్లు మావి.. మీరు ఎప్పుడు కొనుక్కున్నారో.. ఎలా కొనుక్కున్నారో మాకు అనవసరం.. ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం.. మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామంటూ’ పెదగాడిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు అనుచరులు, జనసేన నాయకులు తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారంటూ పెదగాడిలోని జనచైనత్య లేఅవుట్ ప్లాట్ల ఓనర్ల అసోషియేషన్ ప్రతినిధులు వాపోయారు. తమను, తమ ప్లాట్లను అధికారులే కాపాడాలని విన్నవించారు. పెందుర్తి మండలం పెదగాడిలో బుధవారం జరిగిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1993లో జనచైతన్య రియల్ ఎస్టేట్ సంస్థ పెదగాడిలో 47 ఎకరాల్లో లేఅవుట్ వేయగా అందులో 475 ప్లాట్లు తమతో పాటు పలువురు కొనుగోలు చేశారని చెప్పారు. దాదాపు 30 ఏళ్ల పాటు తమ క్రయ, స్వాధీనానుభవంలో ఉన్న ప్లాట్లను తమవి అంటూ స్థానిక జనసేన నాయకులు గత రెండు మూడు రోజులుగా దౌర్జన్యంగా ఆక్రమించుకునేందుకు చూస్తున్నారన్నారు. తమ తాత ముత్తాతల భూములు కొనడానికి మీరెవరు అంటూ దాడులకు పాల్పడుతున్నారంటూ వాపోయారు. మాకు ఎమ్మెల్యే ఉన్నారు.. ప్రభుత్వం ఉంది ఏదైనా చేస్తామంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. తమకు జిల్లా ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని విన్నవించారు.