
చోరీ ఘటనలో ఇద్దరు ఆర్టీసీ సిబ్బంది అరెస్ట్
ఎంవీపీకాలనీ : ఆర్టీసీ బస్సులో ఈ నెల 22న జరిగిన చోరీకి సంబంధించి ఆ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎంవీపీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఎంవీపీ పోలీసు స్టేషన్లో ద్వారకా క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మాధవధార సచివాలయం ఉద్యోగి కమలకుమారి (55) ఈ నెల 22న ఫంక్షన్ నిమిత్తం విజయవాడ వెళ్లి తిరిగి వస్తూ బస్సులో బ్యాగ్ మర్చిపోయారు. తన తమ్ముడి ఇంటికి వెళ్లే క్రమంలో ఆమె గాజువాకలో బస్సు దిగిపోయారు. అనంతరం ఇంటికి వెళ్లాక చూసుకోగా తన బ్యాగ్ కనిపించలేదు. దీంతో మద్దిలపాలెం ఆర్టీసీ డిపోకు వెళ్లి చూడగా బ్యాగ్ ఉన్నప్పటికీ అందులోని 3 బంగారు గొలుసులు, 2 గాజులు, రూ.50,000 నగదు కనిపించలేదు. దీంతో ఆమె ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ద్వారకా క్రైమ్ ఏసీపీ లక్ష్మణరావు, సీఐ చక్రధర్రావు ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించిన ఎంవీపీ క్రైమ్ ఎస్ఐ అప్పలరాజు మద్దిలపాలెం ఆర్టీసీ డిపో కాంట్రాక్ట్ హెల్పర్గా విధులు నిర్వర్తిస్తున్న మొల్లి వెంకటేష్, సూపర్వైజర్ భరటం వెంకటరమణలను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. వారి నుంచి బంగారు అభరణాలతో పాటు రూ.50 వేలు నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐ చక్రధర్రావు, ఎస్ఐ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.