
కమిషనర్ను కలిసిన కాంట్రాక్టర్లు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ను మహా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్కు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. అనంతరం కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లుల విషయాన్ని కమిషనర్ వద్ద ప్రస్తావించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పీవీపీ నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎం.సంజీవరెడ్డి, ఉపాధ్యక్షుడు గుర్రం సింహాచలం, నిర్వాహక కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి బూటు కృష్ణ, కె.అప్పలనాయుడు, కోశాధికారి శ్రీనివాసరావు, సహాయ కోశాధికారి ఎం.రవికుమార్ పాల్గొన్నారు.
కోస్ట్గార్డ్ మాక్ డ్రిల్
విశాఖ సిటీ: సముద్రంలో చమురు కాలుష్యాన్ని నిరోధించేందుకు ఇండియన్ కోస్ట్గార్డ్ ప్రధాన కార్యాలయంలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. నౌకల ప్రమాదాలు, ఇతర కారణాలతో చమురు లీకై సముద్రంలో కలిసిన సమయంలో చేపట్టాల్సిన చర్యలను ప్రదర్శించారు. సముద్రంపై తేలియాడే కృత్రిమ గోడను నిర్మించి చమురు విస్తరణను శోధించారు. స్కిమర్ అనే పరికరం ద్వారా సముద్రంలో ఆయిల్ను సేకరించి పొల్యూషన్ కంట్రోల్ వెసల్లో ఉన్న ట్యాంకుల్లో నింపారు. దాన్ని తీర ప్రాంతానికి తరలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు పాల్గొన్నాయి.
గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతం
ఆరిలోవ: విశాఖ, అనకాపల్లి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలల్లో మిగులు సీట్ల భర్తీకి సంబంధించి శ్రీకృష్ణాపురం గురుకుల పాఠశాలలో బుధవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆయా గురుకులాల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తొలుత ఈ పరీక్ష కోసం అన్ని తరగతులకు 589 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష సమయంలో మరికొందరు విద్యార్థులు దరఖాస్తులతో చేరుకోవడంతో.. అధికారులు వారికి కూడా అవకాశం కల్పించారు. దీంతో మొత్తం 647 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు గురుకులం ప్రిన్సిపాల్ రత్నవల్లి తెలిపారు.