
ప్రాణాలను బలిగొందా...
● పాత పద్ధతిలోనే మెట్లమార్గం నిర్మిస్తే ప్రమాదం జరిగేది కాదు ● అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం
సింహాచలం: సింహాచలం కొండపై షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నుంచి జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేందుకు నిర్మించిన కొత్త మెట్లమార్గం రూపకల్పనలో చేసిన మార్పులే ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో అనేక చందనోత్సవాల సమయంలో అదే స్థలంలో ఉన్న పాత మెట్లమార్గంలో తీవ్రమైన తోపులాటలు, అధిక రద్దీ నెలకొన్నప్పటికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, దురదృష్టవశాత్తు చరిత్రలో మొదటిసారిగా అదే ప్రదేశంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. వివరాల్లోకి వెళితే, సింహగిరిపై ఉన్న బస్టాండ్ నుంచి ఆలయానికి చేరుకోవడానికి ఉన్న మెట్లమార్గం ఇరువైపులా రెండు బ్లాక్లలో వ్యాపారుల షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. గతంలో ఈ మెట్లమార్గం నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి చేరుకునేది. చందనోత్సవం రోజుల్లో భక్తులను ఈ మార్గంలోనే వరుస క్రమంలో పంపి నేరుగా జోడు భద్రాల ప్రాంగణానికి వెళ్లేలా ఏర్పాట్లు చేసేవారు. ప్రసాద్ స్కీమ్ కింద పాత షాపింగ్ కాంప్లెక్స్ను తొలగించి, కొత్త దుకాణాలను రెండు బ్లాక్లుగా పాత పద్ధతిలోనే నిర్మించారు.అయితే, ఈ రెండు బ్లాక్ల మధ్య నిర్మించిన కొత్త మెట్లమార్గం విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహించారు. పాత ప్రణాళికలను అనుసరించకుండా, జోడు భద్రాల వద్దకు చేరుకునే మెట్లను కుడి, ఎడమ వైపులకు మళ్లించారు. మధ్యలో దాదాపు తొమ్మిది అడుగుల ఎత్తులో నాసిరకమైన గోడను నిర్మించడంతో, ఎడమ వైపు నుంచి రూ.300 క్యూలో వెళ్తున్న భక్తులపై అది ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
నేడు కూడా విచారణ
సింహాచలంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం నియమించిన త్రీ మెన్ కమిటీ శుక్రవారం కూడా విచారణ చేయనుంది. దేవస్థానం అధికారులను కూడా విచారించనుంది. గురువారం సంబంధిత ప్రాంతాన్ని బృందం సభ్యులు పరిశీలించి వివరాలు సేకరించారు.
వైదిక వర్గాలు చెబుతున్నా లెక్కచేయకుండా...
ఏటా శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి కొండ దిగువన నాలుగు పర్యాయాలు ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భాలలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కొండపై నుంచి పల్లకిలో దిగువకు తీసుకువస్తారు. గతంలో జోడు భద్రాల నుంచి నేరుగా ఉన్న మెట్లమార్గం ద్వారానే ఊరేగింపు జరిగేది. కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం తర్వాత కూడా అదే విధంగా నిర్మించాలని పలువురు వైదిక పండితులు సూచించినప్పటికీ, అధికారులు వారి మాటలను పట్టించుకోలేదని తెలుస్తోంది. వారి నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు ఏడుగురు భక్తుల ప్రాణాలను బలిగొన్న విషాదానికి దారితీసింది.
గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న
త్రీమెన్ కమిటీ సభ్యులు