ఎయిడెడ్‌ ఆచార్యులు ఔట్‌ | - | Sakshi
Sakshi News home page

ఎయిడెడ్‌ ఆచార్యులు ఔట్‌

May 31 2025 12:47 AM | Updated on May 31 2025 12:47 AM

ఎయిడెడ్‌ ఆచార్యులు ఔట్‌

ఎయిడెడ్‌ ఆచార్యులు ఔట్‌

● ఏయూ నుంచి 38 మంది రిలీవ్‌ ● కన్నీటి పర్యంతమైన మహిళా ఆచార్యులు ● పరిశోధక విద్యార్థులకు తప్పని అగచాట్లు

విశాఖ విద్య: ఆంధ్ర యూనివర్సిటీలో ఫారిన్‌ సర్వీసు/డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 38 మంది ఆచార్యులు శుక్రవారం ఇక్కడ నుంచి రిలీవ్‌ అయ్యారు. వైస్‌ చాన్సలర్‌ ఆదేశాలతో డిప్యూటీ రిజిస్ట్రార్‌(అకడమిక్‌) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి పోస్టింగ్‌ నిమిత్తం మంగళగిరిలోని కాలేజ్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో తక్షణమే రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో డిప్యుటేషన్‌పై పని చేస్తున్న ఆచార్యులంతా శుక్రవారం సాయంత్రం క్యాంపస్‌ కాలేజీ ప్రిన్సిపాళ్ల ఆమోదంతో తమ విధుల నుంచి రిలీవ్‌ అయ్యారు.

సాగనంపడమే లక్ష్యంగా..

రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఫారిన్‌ సర్వీసు/డిప్యుటేషన్‌ ప్రాతిపదికన 2023 జూన్‌లో 80 మంది ఆచార్యులు వచ్చారు. అనివార్య కారణాల వల్ల 40 మంది అప్పుడే వెనక్కి వెళ్లిపోగా, ఒకరు మరణించారు. మరొకరు ఇటీవలే తమ మాతృస్థానానికి వెళ్లారు. ప్రస్తుతం 38 మంది ఆచార్యులు పనిచేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో వెయ్యికి పైగా రెగ్యులర్‌ ఆచార్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం రెండు వందల లోపే ఉన్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యుటేషన్‌ పై పనిచేస్తున్న సీనియర్‌ ఆచార్యులను ఈ సంవత్సరం కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ నాటకీయ పరిణామాల నడుమ వారందరినీ ఆగమేఘాల మీద రిలీవ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

అగౌరవంగా.. అవమానకరంగా..

డిప్యుటేషన్‌ పై వచ్చిన ఆచార్యులను ఏయూ నుంచి పంపించేస్తారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై కలత చెందిన కొంత మంది ఆచార్యులు మూడు రోజుల కిందట వీసీని కలిసి తమ ఇబ్బందులను చెప్పుకున్నారు. పిల్లల చదువుల దృష్ట్యా ఈ సంవత్సరం కొనసాగించాలని, విశ్వవిద్యాలయం వంద ఏళ్ల ఉత్సవాల్లో భాగస్వాములయ్యే అవకాశం కల్పించాలని విన్నవించినట్లు తెలిసింది. అదే సమయంలో కూటమికి చెందిన కొంతమంది ప్రజా ప్రతినిధులను కూడా కలిసినప్పటికీ, ఉన్నట్టుండి రిలీవ్‌ చేయడంతో డిప్యుటేషన్‌ పై వచ్చిన ఆచార్యులు షాక్‌కు గురయ్యారు. వర్సిటీ నాక్‌ గ్రేడ్‌ సాధించడంలో ఎంతో కీలకంగా పనిచేసిన తమను ఇలా అగౌరవంగా, అవమానకరంగా రిలీవ్‌ చేయడంపై కొంతమంది మహిళా ఆచార్యులు వర్సిటీ పెద్దల ముందు కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది.

రీసెర్చ్‌ స్కాలర్ల దారెటు?

డిప్యుటేషన్‌ పై వచ్చిన వారంతా సీనియర్‌ ఆచార్యులు కావడంతో విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఇలా ఒక్కో ఆచార్యుని వద్ద నలుగురు లేదా ఐదుగురు పరిశోధక విద్యార్థులు పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం 38 మంది ఆచార్యులను వర్సిటీ నుంచి రిలీవ్‌ చేయడంతో.. ఇప్పటివరకు వారి మార్గదర్శకత్వంలో ఉన్న పరిశోధక విద్యార్థుల పరిస్థితి ఏమిటనేది తేలాల్సి ఉంది. గైడ్‌ షిప్‌ మారే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వర్సిటీ అధికారులు వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పరిశోధక విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement