
కదల్లేని వయసులో కష్టం
● ఈ నెలా పింఛన్ల కోసం వృద్ధుల అవస్థలు ● 92.61 శాతం మందికి పింఛన్ల అందజేత
మహారాణిపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా.. పింఛన్దారుల కష్టాలు తీరకపోగా మరింత పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఇంటికే వచ్చి పింఛన్లు అందించే వలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి.. ఇప్పుడు వృద్ధులు, వికలాంగులు, మహిళలను సచివాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. నెలవారీ పింఛన్ కోసం గంటల తరబడి ఎండలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. శనివారం పెదజాలారిపేట సచివాలయం వద్ద మధ్యాహ్నం 11 గంటల తర్వాత గానీ పింఛన్ల పంపిణీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఒకే దగ్గర లబ్ధిదారులను చేర్చి.. పింఛన్లు పంపిణీ జరిగింది. బయోమెట్రిక్ ద్వారానే పంపిణీ అని చెబుతున్నా.. అనేక చోట్ల సాంకేతిక సమస్యతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడ్డారు.
పింఛన్లలో భారీ కోత
ఎన్నికల ముందు 50 ఏళ్లు దాటిన వారందరికీ పింఛన్లు ఇస్తామని హామీల వర్షం కురిపించి.. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోగా.. 60 ఏళ్ల పైబడి అర్హులైన వారి పింఛన్లలోనూ భారీగా కోత పెడుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో 1.68 లక్షల మంది పింఛనుదారులు ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలివిగా ప్రతి నెలా దాదాపు వెయ్యి మంది చొప్పున లబ్ధిదారులను తొలగిస్తూ వచ్చింది. దీంతో జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 1,59,085కు పడిపోయింది. గడిచిన ఏడాది కాలంలోనే సుమారు 9 వేలకు పైగా అర్హులైన పింఛన్దారులను అన్యాయంగా తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఒక్క రోజు ముందుగానే..
జిల్లాలో శనివారం ఎన్టీఆర్ సామాజికభద్రత పింఛన్ల కార్యక్రమం జరిగింది. జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో మొత్తం 1,59,085 పింఛన్లు ఉండగా.. ప్రభుత్వం రూ.69.64 కోట్లను విడుదల చేసింది. శనివారం రాత్రి ఏడు గంటలకు 1,47,826 మందికి రూ.64.45 కోట్లను సచివాలయం సిబ్బంది అందజేశారు. జిల్లాలో మొత్తం 92.92 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ లక్ష్మీపతి తెలిపారు. మిగిలిన వారికి సోమవారం అందజేస్తామని వెల్లడించారు.

కదల్లేని వయసులో కష్టం

కదల్లేని వయసులో కష్టం