
పార్టీకి సోషల్ మీడియా కార్యకర్తలే బలం
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీకి సోషల్ మీడియా కార్యకర్తలే కొండంత బలమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కె.కె.రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. జిల్లాలో 8 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లలో 50కి పైగా అక్రమ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మద్దిలపాలేనికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త బోస రమణారెడ్డిపై ఆరు కేసులు, గాజువాక మండలం గొల్లజగ్గరాజుపేటకు చెందిన బొడి వెంకటేష్పై మొత్తం 17 కేసులు, విశాఖకు చెందిన ఇంటూరి రవికిరణ్పై రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మొత్తం 21 కేసులు, అలాగే ప్రసాద్ సిద్దు, గోపిరాజు వంకా, సదరం జ్ఞానేష్లపై మార్టూరు పోలీస్స్టేషన్లో కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి అధికారిని గుర్తుపెట్టుకోండన్నారు. రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని, మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం తథ్యమన్నారు. ప్రజా సంకల్ప యాత్ర దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలు అండగా నిలిచారని గుర్తు చేశారు. మరోమారు పార్టీకి, అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయ ఇన్చార్జి రవిరెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి, కార్పొరేటర్లు, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు