
సరిపల్లి దాటిన తర్వాత సర్వీస్ రోడ్డులో ప్రమాదం
పెందుర్తి: బైక్పై సరదాగా షికారుకు వెళ్లిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బైక్పై వేగంగా వెళుతున్న సమయంలో కుక్క అడ్డు రావడంతో నియంత్రణ కోల్పోయి వాహనం అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం పెందుర్తి పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తి రాచ్చెరువు సమీపంలోని ఆదిత్యనగర్కు చెందిన శరగడం శ్రీనివాసరావు కుమారుడు శరగడం డాని సత్య అవినాష్(20), పెందుర్తి కూడలి వద్ద నివాసం ఉంటున్న మద్దాల సుధారాణి కుమారుడు మద్దాల శ్రీరామ్(17) స్నేహితులు. అవినాష్ నగరంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా.. శ్రీరామ్ ఇటీవలే ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించాడు.
ఇద్దరు కలిసి ఆదివారం సాయంత్రం ట్రయంప్ బైక్పై ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారి మీదుగా శొంఠ్యాం వైపు వెళుతున్నారు. సరిగ్గా సరిపల్లి దాటిన తరువాత సర్వీస్ రోడ్డులో కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఇరువురు తలలకు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పెందుర్తి సీఐ కె.వి.సతీష్కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ నరసింగరాజు సిబ్బందితో అక్కడికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అంతులేని విషాదం
ప్రమాదంలో మృతి చెందిన మద్దాల శ్రీరామ్ తండ్రి సతీష్ కోవిడ్ సమయంలో మరణించాడు. దీంతో సుధారాణి పెందుర్తిలో ఓ కిరాణా దుకాణం నడుపుతూ పిల్లలను చవివిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న శ్రీరామ్ ఎంసెట్ రాశాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు శ్రీరామ్ను బలిగొంది. కాగా శరగడం శ్రీనివాసరావు, అరుణ దంపతులకు అవినాష్తో పాటు ఓ కుమార్తె ఉంది. బీటెక్ చదువుతున్న అవినాష్ చదువులో చురుగ్గా ఉంటాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.