
ఏపీలో తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్స
● తొలి రివర్స్ షోల్డర్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్స ● ఘనత సాధించిన ఎంజీఎం సెవెన్హిల్స్ హాస్పిటల్
డాబాగార్డెన్స్: విశాఖలోని ఎంజీఎం సెవెన్హిల్స్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సుశాంత్కుమార్ మల్లిక్ నేతృత్వంలో రాష్ట్రంలో రెండు చారిత్రాత్మక ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కుడి మోకాల్లో అడ్వాన్స్డ్ స్టేజ్–4 పోస్ట్ ట్రమాటిక్ ఆస్టియో ఆర్థరైటిస్తో బాధపడుతున్నాడు. ఎంజీఎం సెవెన్హిల్స్ హాస్పిటల్లో చేరగా వైద్య బృందం రాష్ట్రంలోనే తొలి సిరామిక్ మోకాలి సంయోజన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మెటల్ ఇంప్లాంట్స్ కంటే సిరామిక్ ఇంప్లాంట్స్ ఎక్కువకాలం నిలిచి, అలర్జీ కలిగించని, బయో కంపాటిబుల్ లక్షణాలతో రోగులకు మెరుగైన, దీర్ఘకాల ఫలితాలు ఇస్తాయన్నారు. అలాగే రాష్ట్రంలోనే తొలి రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఒడిశాలోని బొలంగీర్కు చెందిన 48 ఏళ్ల సునీల్కుమార్ బిశ్వాల్ రొటేటర్ కఫ్ ఆర్థోపతి, సికిల్సెల్ వ్యాధి కారణంగా షోల్డర్ జాయింట్లో తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయి. దీనికి అధునాతన శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. ఈ పద్ధతిలో భుజం కీళ్ల నిర్మాణం రివర్స్ చేయబడుతుందని, డెల్టాయిడ్ మజిల్ రొటేటర్ కఫ్ ద్వారా భుజం కదలికలను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఈ శస్త్ర చికిత్స ద్వారా రోగి జీవిత నాణ్యతలో మెరుగుల కనిపించిందని, ఇంతకు ముందు ఇదే హాస్పిటల్లో హిప్ రివిజన్ శస్త్రచికిత్స విజయవంతంగా చేసుకున్న రోగి ప్రస్తుతం ఫిజియోథెరపీతో కోలుకుంటున్నాడని చెప్పారు. సమావేశంలో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ చందర్ సుడ్, జనరల్ మేనేజర్ సందీప్కుమార్ లెంక, డీజీఎంలు అశోక్ పట్నాయక్, వై.రమేష్ పాల్గొన్నారు.