
దివీస్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
తగరపువలస: బాలాజీనగర్లో నివాసం ఉంటున్న దువ్వారపు సత్యప్రకాష్ (31) అనే దివీస్ ఉద్యోగి శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, రజకులపేటకు చెందిన సత్యప్రకాష్ దివీస్ లేబొరేటరీస్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు మూడేళ్ల క్రితం లక్ష్మీదుర్గతో వివాహం జరిగింది. బాలాజీనగర్లో కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్న సత్యప్రకాష్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. శనివారం ఇంట్లో ఉన్న సమయంలోనే స్పృహ కోల్పోయి పడి ఉండటాన్ని అతని భార్య గమనించింది. నోటి వెంట నురగలు కూడా రావడంతో ఆటోలో భర్తను అనిల్ నీరుకొండ జనరల్ ఆసుపత్రికి తరలించింది. అక్కడ పరీక్షించిన వైద్యులు సత్యప్రకాష్ మృతి చెందినట్టు నిర్ధారించారు. భీమిలి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.