కార్పొరేట్లకు కేంద్రం వత్తాసు | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్లకు కేంద్రం వత్తాసు

Jun 9 2025 8:06 AM | Updated on Jun 9 2025 8:06 AM

కార్పొరేట్లకు కేంద్రం వత్తాసు

కార్పొరేట్లకు కేంద్రం వత్తాసు

సిటు అఖిల భారత కోశాధికారి సాయిబాబు

డాబాగార్డెన్స్‌: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక స్వావలంబనను దెబ్బతీశాయని సిటు అఖిల భారత కోశాధికారి సాయిబాబు ఆరోపించారు. డాబాగార్డెన్స్‌లోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం సిటు 18వ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ కేంద్రం బహుళజాతి కంపెనీలు, కార్పొరేట్‌లకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మిక శక్తి ఏకమై వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 1970లో ఐక్యతా నినాదంతో ప్రారంభమైన సిటు.. విద్యుత్‌ ప్రైవేటీకరణ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తోందన్నారు. కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలను సిటు విజయవంతంగా అడ్డుకుందన్నారు. 1991 నుంచి ఇప్పటివరకు 21 సార్వత్రిక సమ్మెలు నిర్వహించామని, వచ్చే నెల 9న జరగనున్న సమ్మెను కూడా కార్మిక సంఘాలు ఐక్యంగా నిర్వహించాలని కోరారు. ఎన్‌డీఏ హయాంలో దేశ జీడీపీని ప్రభావితం చేసే రంగాలు కుదేలయ్యాయని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వద్ద ప్రణాళికలు లేవని విమర్శించారు. రైల్వే, డిఫెన్స్‌ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. పెహల్గాం ఉగ్రదాడి అనంతరం మత విభజన జరిగేలా బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారన్నారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల సభ్యులు ఈ సభల విజయానికి కృషి చేయాలని కోరారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పోరాటం

సిటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నరసింగరావు మాట్లాడుతూ తమ సంఘం పోరాటం వల్లే ఇప్పటివరకు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌పరం కాలేదన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వారిని స్టీల్‌ ప్లాంట్‌ సీఎండీలుగా నియమించి.. నీతి ఆయోగ్‌ ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని అణచివేసే చర్యలు చేపడుతున్నారని, ఇది కేంద్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖను ఒక ప్రయోగశాలగా చూస్తోందన్నారు.

పవన్‌ కల్యాణ్‌పై సిటు విమర్శలు

సిటు పోరాటంలో భాగంగా స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఆత్మహత్య చేసుకున్న బాధితుడి కుటుంబాన్ని పరామర్శించి పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోకి వచ్చారని నరసింగరావు గుర్తు చేశారు. అలాంటి పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఎన్‌డీఏ పక్షాన నిలబడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రం తర్వాత ఇంతటి కార్మిక అణచివేత చర్యలు ఎప్పుడూ జరగలేదన్నారు. అనంతరం ఈ ఏడాది డిసెంబర్‌ 31 నుంచి విశాఖలో నిర్వహించనున్న 18వ జాతీయ మహాసభల ఆహ్వాన కమిటీని సిటు రాష్ట్ర అధ్యక్షుడు కేవీ నాగేశ్వరరావు ప్రకటించారు. కమిటీ చైర్మన్‌గా సీహెచ్‌ నరసింగరావు, ప్రధాన కార్యదర్శిగా ఆర్‌కేఎస్‌వీ కుమార్‌, కోశాధికారిగా ఏవీ నాగేశ్వరరావు వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement