
బావిలో పడి వ్యక్తి మృతి
పెందుర్తి: తోటి కూలీలతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. పెందుర్తి మండలం ముదపాకలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ కె.వి.సతీష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా తెర్లాంకి చెందిన పక్కి ప్రసాద్(25) ముదపాకలోని జగనన్న కాలనీలో నిర్మాణ పనులు చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటి పనులు చేసిన తరువాత సమీపంలోని బావిలోకి తోటి ముగ్గురు నిర్మాణ కూలీలతో కలిసి ఈతకు వెళ్లాడు. మిగిలిన వారు వెళ్లిపోదాం అంటే ‘నేను కాసేపు ఉండి వస్తాను’ అని చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రసాద్ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తోటి కూలీలు బావి వద్దకు వెళ్లారు. అక్కడ దుస్తులు ఉండడంతో ప్రసాద్ నీటిలో మునిగిపోయి ఉండవచ్చని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఆదేశాల మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రసాద్ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. కేసు దర్యాప్తు జరుగుతుంది.