
యోగా వేడుకల విజయవంతానికి చర్యలు
● రవాణా, పార్కింగ్పై దృష్టి సారించాలి ● ఏర్పాట్లను సమీక్షించిన నోడల్ అధికారి డాక్టర్ మల్లికార్జున
మహారాణిపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్దేశిత సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా పక్కా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్, యోగా ఉత్సవాల మొబలైజేషన్, ట్రాన్స్పోర్టు నోడల్ అధికారి డాక్టర్ ఎ.మల్లికార్జున జిల్లా అధికారులను ఆదేశించారు. యోగా ఉత్సవాల నిర్వహణ, రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు శనివారం జిల్లాకు వచ్చిన ఆయన.. కలెక్టరేట్లో కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జేసీ కె.మయూర్ అశోక్, ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్లతో కలిసి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లక్ష్యాన్ని చేరుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. బీచ్రోడ్డులో ఎంత మంది కూర్చోగలరు. అదనపు వేదికల్లో ఎంత మందికి అవకాశం ఉంటుందనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ప్రతి 24 చదరపు అడుగులకు ఒకరు యోగాసనాలు వేసేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజల వాహనాల పార్కింగ్కు తగిన జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. కంపార్ట్మెంట్ల వారీగా బస్సులు కేటాయించాలని, ఆయా వాహనాలకు నిర్దేశిత స్థలాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల రాకపోకల విషయంలో గందరగోళం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టర్ హరేందిర ప్రసాద్ మ్యాప్ల ద్వారా వివరించారు. భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, జీవీఎంసీ ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.