● ఎస్పీ స్నేహ మెహ్ర
● జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ దర్బార్
అనంతగిరి: మనమంతా ఒకే కుటుంబం, కలసిమెలసి పని చేద్దామని ఎస్పీ స్నేహ మెహ్ర అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఆ శాఖ అధికారులు, సిబ్బందితో ముఖాముఖిగా మాట్లాడారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఇబ్బందులు, వ్యక్తిగత, కుటుంబ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణ, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. సమాజానికి రోల్ మోడల్గా నిలవాలన్నారు. సిబ్బంది సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ ముందుంటుందన్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం చట్ట విరుద్ధ పనులకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఆర్ఐ శ్రీశైలం, ఆర్ఎస్ఐలు, ఏఆర్ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


