న్యూస్రీల్
గురువారం శ్రీ 14 శ్రీ మే శ్రీ 2026
వికారాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపికతో ఆగిపోయింది. అర్జీలు స్వీకరించి ఏడాది గడిచినా ప్రభుత్వం రుణాల ఊసే ఎత్తడం లేదు. గతేడాది జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తామని హడావుడి చేసిన ప్రభుత్వం ఆ తర్వాత మిన్నకుండి పోయింది. యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గతేడాది మే నెలలో దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం పరిశీలన ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత పథకం అమలుపై కదలిక లేకపోవడంతో యువత నిరుత్సాహానికి గురువుతోంది.
తాండూరు నుంచి అత్యధికంగా..
రాజీవ్ యువ వికాసం పథకం కోసం జిల్లా వ్యాప్తంగా 50,197 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొడంగల్ మున్సిపాలిటీ నుంచి అత్యల్పంగా 760 మంది దరఖాస్తు చేయగా.. తాండూరు మండలం నుంచి అత్యధికంగా 3,456 మంది దరఖాస్తు చేసుకున్నారు. తదనంతరం అర్జీలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. యూనిట్ ధర రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు అందజేయాలని నిర్ణయించారు. ఇందులో రూ.లక్షకు 90 శాతం రాయితీపై రుణాలు అందజేస్తారు. రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ వర్తించనుంది. రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణం పొందే వారికి 70 శాతం రాయితీ వర్తిస్తుంది.
నేతల కనుసన్నల్లోనే ఎంపిక
లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్న వారు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి వారికి లబ్ధి చేకూరేలా చూసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. నేతల అండదండలు ఉన్న వారికే జాబితాలో పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పథకం ఎప్పుడు అమలు చేస్తారు అనే దానిపై క్లారిటీ లేదు. యువత మాత్రం ఏడాదిగా రుణాల కోసం ఎదురు చూస్తోంది.
రాజీవ్ యువ వికాసానికి వచ్చిన దరఖాస్తులు 50,197
ఏడాది క్రితం లబ్ధిదారుల ఎంపిక
ఆ తర్వాత ఆగిపోయిన ప్రక్రియ
రుణాల కోసం యువత ఎదురుచూపులు


