డబ్బులకోసం ప్రాణం తీశాడు | - | Sakshi
Sakshi News home page

డబ్బులకోసం ప్రాణం తీశాడు

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

హత్య కేసును ఛేదించిన పోలీసులు

ఇద్దరు నిందితులకు రిమాండ్‌

షాద్‌నగర్‌రూరల్‌: రెండు రోజుల క్రితం జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను మంగళవారం డీసీపీ శిరీష వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్‌ మండలం పోమాల్‌ గ్రామానికి చెందిన పల్లెకేశవులు, పద్మ దంపతులు షాబాద్‌ మండలం సర్దార్‌నగర్‌లోని శ్రీనివాసరావుకు చెందిన ఫాంహౌస్‌లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు. సొంత ఊరిలో పొలానికి సంబంధించిన కేసును మాట్లాడేందుకు ఈ నెల 9న పల్లెకేశవులు యజమాని వద్ద రూ.50వేలు తీసుకొని పరిగి వెళ్లి కేసు విషయంలో రూ.40 వేలు ఇచ్చి తిరిగి రాత్రికి షాద్‌నగర్‌ బస్టాండ్‌కు చేరుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా గంజిపేటకు చెందిన పుల్లగోయి బజారన్న కొంతకాలం క్రితం పట్టణానికి వచ్చి కూలీ పనులు చేస్తూ పరమేశ్వర థియేటర్‌ సమీపంలో నివసిస్తున్నాడు. కేశవులు బస్టాండ్‌ ఎదురుగా ఉన్న వైన్స్‌ పర్మిట్‌ రూంలో మద్యం తాగేందుకు వెళ్లాడు. అక్కడే ఉన్న బజారన్న పరిచయమయ్యాడు. ఇద్దరు బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళ మద్యం తీసుకునేందుకు వైన్స్‌ షాపు వద్దకు వచ్చింది. ఆమెతో గడిపేందుకు తీసుకురావాలని బజారన్నకు జేబులో నుంచి డబ్బుల తీసి ఇవ్వడానికి ప్రయత్నించాడు. కేశవులు వద్ద ఎక్కువ డబ్బులు ఉన్నాయనే విషయాన్ని గమనించిన అతను మహిళతో కలిసి ఎలాగైనా వాటిని కాజేయాలనుకున్నాడు. తన బైక్‌పై కేశవులు, మహిళను ఎక్కించుకొని పట్టణ సమీపంలోని వెంచర్‌లోకి తీసుకెళ్లాడు. కేశవులు వద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించాడు. అతను ప్రతిఘటించడంతో పక్కనే ఉన్న రాయితో ముఖం, తలపై బలంగా కొట్టడంతో అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి వద్ద ఉన్న రూ.7,500 తీసుకొని ఇద్దరూ పరారయ్యారు. బజారన్న సొంత గ్రామానికి వెళ్లి రెండు రోజుల తరువాత తన గదిలోని సామాను తీసుకెళ్లేందుకు పట్టణానికి వచ్చాడు. అనుమానాస్పదంగా కనిపించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. మరో నిందితురాలిని సైతం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.3,900 నగదు, బైక్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని డీసీపీ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement