ధారూరు: తూకం వేసిన మొక్కజొన్న సంచులను వెంటనే తరలించకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆరోపించారు. సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ధారూరులోని మొక్కజొన్న కేంద్రాన్ని, గట్టెపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు గోనె సంచులు ఇవ్వడం లేదని.. మొక్కజొన్న సంచులు సకాలంలో తూకం వేయకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోయారు. గట్టెపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులైనా ఒక్క సంచి ధాన్యం కొనుగోలు చేయలేరని ఆయన ధ్వజమెత్తారు. ఇదేమిటని నిర్వాహకులను ప్రశ్నిస్తే హమాలీలు రావడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మార్క్ఫెడ్, సివిల్ సప్లై అధికారులను అడిగితే తమ దృష్టికి రాలేదని సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ధాన్యం, మొక్కజొన్నలను సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారుర. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు హఫీజ్, బీఆర్ఎస్ నాయకులు వేణుగోపాల్రెడ్డి, రాములు, పోటరీ మహేశ్, రహమతుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.


