అనంతగిరి: రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్, నాయకులు వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం రైతుల సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అనంతరం కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, టెంట్లు ఏర్పాటు చేయాలని, క్వింటాల్కు బోనస్ రూ.500 ఇవ్వాలని, ప్రైవేట్ కొనుగోలు కేంద్రాలపై చర్యలు తీసుకోవాలలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి కూలీల వ్యతిరేక జీఓలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు 14 వారాల పెండింగ్ డబ్బులు తక్షణమే విడుదల చేసి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. కూలీ రూ.600లకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామకృష్ణ, శ్రీనివాస్, చంద్రయ్య, బుగ్గప్ప, సుదర్శన్, సతీశ్, మంగమ్మ, నర్సింలు, సంతోష, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్


