అనంతగిరి: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నట్లు జిల్లా ఇంటర్ విద్య నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఫ్లయింగ్, సిట్టింగ్ స్వాడ్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు ప్రతి రోజు రెండు విడతల్లో ఉంటాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఉంటాయన్నారు. గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సెంటర్లో ఇంటర్నెట్, ప్రింటర్, సీసీ కెమెరాలు, విద్యుత్, తాగునీటి సదుపాయం ఉండేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి హాల్టికెట్లు పొందాలని సూచించారు. కార్యక్రమంలో డీఈసీ మెంబర్లు బుచ్చిరెడ్డి, సత్తయ్య, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.


