అనంతగిరి: జిల్లాల పునర్విభజన జరిగి పదేళ్లు అయినా.. ఇంకా వికారాబాద్లో ఉమ్మడి జిల్లా రంగారెడ్డి పేరే దర్శనమిస్తోంది. వికారాబాద్ పట్టణంలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ బోర్డుపై ఇప్పటికీ వికారాబాద్కు బదులు రంగారెడ్డి జిల్లా అక్షరాలే కనిపిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపమే ఇందుకు కారణమని పలువురు ఆరోపించారు. అధికారులు స్పందించి, బోర్డును మార్చాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు
మోమిన్పేట: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని దిశా కమిటీ సభ్యుడు వడ్ల నందు అన్నారు. బుధవారం మండలంలోని రాళ్లగుడుపల్లి గ్రామంలో ఎంపీ నిధులు రూ.10లక్షలతో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ వర్త్య మహిపాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు, అంగన్వాడీ, డ్వాక్రా భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కరోనా నాటి నుంచి నేటి వరకు ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అశిరెడ్డి, నాయకులు అరుణ్కుమార్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గో సంరక్షుడిపై దాడి
మీర్పేట: గోవుల అక్రమ రవాణాన్ని అడ్డుకునేందుకు యత్నించిన యువకుడిపై దాడికి పాల్పడిన సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బుధవారం ఉదయం యాచారం నుంచి బొలేరో వాహనంలో ఆరు గోవులను నగరానికి తరలిస్తున్నారు. దీని వెనుక రక్షణగా మరో కారు ప్రయాణిస్తోంది. ఇది గమనించిన గడ్డమల్లయ్యగూడ గ్రామానికి చెందిన ప్రేమ్కుమార్ (24) బైక్పై వెంబడించాడు. మీర్పేట పోలీస్స్టేషన్ పరిధి మందమల్లమ్మ వద్దకు రాగానే ప్రేమ్కుమార్ బైక్ను వాహనానికి అడ్డు పెట్టగా, వెంటనే వెనుక కారులో నుంచి కొందరు వ్యక్తులు దిగి అతడిపై దాడి చేసి పారిపోయారు. ప్రేమ్కుమార్ స్థానికుల సాయంతో ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. విషయం తెలుసుకున్న బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి అందెల శ్రీరాములు యాదవ్, ఇతర నాయకులు మీర్పేట పోలీస్స్టేషన్కు వెళ్లి గో సంరక్షకుడిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేసు నమోదు చేశామని, దాడికి పాల్పడ్డ గుర్తు తెలియని వ్యక్తులను అరెస్ట్ చేస్తామని ఇన్స్పెక్టర్ శంకర్నాయక్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
యాచారం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన యాచారం పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కందుకూరు మండల పరిధిలోని కోలన్గూడ గ్రామానికి చెందిన ఆదర్ల రాజు(33) మంగళవారం రాత్రి చింతుల్ల గ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు రాజును ఎవరో తీవ్రంగా కొట్టి హత్య చేసినట్లు ఆరోపించారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాచారం సీఐ నందీశ్వర్రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం రాజు మృతదేహన్ని ఉస్మానియాకు తరలించారు.


