● రూ.10.29 లక్షలకు ఆమోదం
● పలు కేటాయింపులపై అభ్యంతరం తెలిపిన ప్రతిపక్ష కౌన్సిలర్లు
తాండూరు: మున్సిపల్ బడ్జెట్ కేటాయింపులు నిరాశపరిచాయి. బుధవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్రెడ్డి అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. 2026 –27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.27.82 కోట్ల బడ్జెట్ ఆమోదానికి కౌన్సిల్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభ నిల్వ రూ.10.29 లక్షలకు ఆమోదం తెలిపారు. ఆస్తి పన్ను ద్వారా రూ.10 కోట్లు, స్టాంప్ డ్యూటీల ద్వారా రూ.కోటి, తైబజార్ ద్వారా సమకూరే ఆదాయం రూ.5 లక్షలు, మున్సిపల్ దుకాణాల ద్వారా రూ.50 లక్షలు, ట్రేడ్ లైసెన్సుల ద్వారా రూ.50 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. పట్టణ ప్రణాళిక ద్వారా లేఅవుట్లు, ఫీజులు, భవనాల క్రమబద్ధీకరణతో రూ.2.11 కోట్ల ఆదాయం సమకూరుతోందని అన్నారు. బడ్జెట్ కేటాయింపులు నిరాశపరిచిందని ప్రతిపక్ష బీఆర్ఎస్ కౌన్సిలర్లు అన్నారు. ఆదాయం కంటే అనవసర ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా బడ్జెట్ రూపకల్పన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధన ఖర్చులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కమిషనర్ మధుసూదర్రెడ్డి, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింహులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


