పరిగి: మండలంలోని లక్ష్మీదేవిపల్లి సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. మంటలు ఎగసిపడి దట్టమైన పొగ అలముకుంది. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో సమీప పొలాల్లోని రైతులు, పరిశ్రమలోని కార్మికులు భయాందోళనకు గురయ్యారు. బట్టీ వద్ద పని చేస్తున్న కొంత మంది కార్మికులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. ప్రమాద స్థలం వద్దకు ఎవ్వరినీ అనుమతించలేదు. తొలుత లారీ టైరు పేలిందని యాజమాన్యం చెప్పుకొచ్చింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వెంకటేశ్వరి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పేలుడుకు గల కారణాలు తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని కార్మికులు వాపోయారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. కార్మికులు మృత్యువాత పడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని పరిశ్రమను మూసి వేయాలని డిమాండ్ చేశారు.
పేలుడు ధాటికి ఎగసిపడుతున్న
మంటలు, పొగ
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న తహసీల్దార్ వెంకటేశ్వరి


