తాండూరు రూరల్: పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో పొలాల వద్ద బోరు మోటార్ల విద్యుత్ వైర్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైతుల తెలిపిన ప్రకారం.. గ్రామ శివారులో రైతులు బోరు మోటార్ల కింద వరి సాగు చేస్తున్నారు. శనివారం రాత్రి వైర్లను దొంగిలించినట్లు గుర్తించిన రైతులు ఆదివారం పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకుడు రంగరాజన్ నగరంలోని సైనిక్పురిలో ఆదివారం జరిగిన 108 శ్రీరామ భక్తి గీతాల గాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వరరాజ భారతీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామ భజనలు, కీర్తనలు, నామసంకీర్తనలు చేశారు. భక్తులందరినీ ఆధ్యాత్మిక భక్తి రసంలో ముంచిన భక్తి సంగీత కార్యక్రమం ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యాభారతి, రంగరాజన్ను సన్మానించారు.
తెలంగాణ సేవా ప్రముఖ్ శివశంకర్
షాబాద్: హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ సేవా ప్రముఖ్ శివశంకర్ పేర్కొన్నారు. మండల పరిధిలోని నాగర్గూడ పీఎస్ఆర్ గార్డెన్లో ఆదివారం ఉప మండల హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా శివశంకర్తోపాటు శ్రీమతి శ్రీలత, విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి అష్ట తీర్థస్వామిజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పారు. పంచ పరివర్తనలో భాగంగా ప్రకృతిని కాపాడుకోవాలని, పౌర విధులు పాటించాలన్నారు. హిందువు అనేది మతం కాదు, ఇది ఒక ధర్మం అని వివరించారు. అనంతరం భగవద్గీత పారాయణం చేశారు. చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శ్రీనివాస్, గోపాల్రెడ్డి, యాదివరెడ్డి, ప్రసాద్, మల్లేష్, ప్రవీణ్, గూడెం రమేష్, వెంకట్రెడ్డి, ప్రశాంత్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
యువకుడి ఆత్మహత్య
మంచాల: ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఓ యువకుడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెనమోని భాస్కర్(30) వృత్తి రీత్యా ఎలక్ట్రీషన్. ఇటీవల ఆయన తల్లి చనిపోవడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలు దాటినా ఆయన బయటకు రాలేదు. దీంతో చుట్టుపక్కల వారు గమనించి ఊర్లో ఉన్న అతడి అన్న బాలరాజు, అక్క లక్ష్మికి విషయం చెప్పారు. వారు వెంటనే వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా చీరతో ఉరి వేసుకొని వేళాడుతూ విగతజీవిగా భాస్కర్ కనిపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు సైతం ఫిర్యాదులో పేర్కొన్నారు.


