మున్సిపల్ చైర్పర్సన్ దేవరి సమతావెంకట్రెడ్డి
చేవెళ్ల: మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చైర్పర్సన్ దేవరి సమతావెంకట్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధి దామరగిద్ద 9వ వార్డులో ఆదివారం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాజీ సర్పంచ్ మధుసూదన్గుప్తా తన సొంత నిధులతో రామాలయం వద్ద సీసీరోడ్డు వేయిస్తున్నారు. ఈ మేరకు కౌన్సిలర్ తాళ్లపల్లి నర్సింలు ఆధ్వర్యంలో ఆమె కౌన్సిలర్లతో కలిసి రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాయకులు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటంతో వారి పట్ల నమ్మకం పెరుగుతుందన్నారు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజాసేవ చేయాలన ఆలోచన ఉన్న వారు సమస్యల పరిష్కారంలో ముందుంటారని తెలిపారు. అనంతరం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మధుసూదన్గుప్తాను వారందరూ అభినందించారు. మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం శ్రీరామనవమికి ముందే ఆలయం వద్ద రోడ్డును వేయిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు బండారి శైలజఆగిరెడ్డి, ఎం.కల్యాణి, ఎం.శ్రీనివాస్, మాజీ సర్పంచ్ వెంకటేశంగుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బి.రాములు, వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు.


