శతశాతం భవతి
ప్రత్యేక చర్యలు
అభివృద్ధిలో కీలకం
కొత్తూరులో 45 శాతం
షాద్నగర్: మున్సిపాలిటీల్లో పన్నుల వసూళ్ల గడువు ముంచుకొస్తోంది. కొంత కాలంగా సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించడంతో వసూళ్లు ప్రక్రియ మందగించింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో నెల రోజుల్లో ముగియనుండడంతో అధికారులు దృష్టి సారించారు. సిబ్బంది ఉరుకులుపరుగులు పెడుతున్నారు.
ఎన్నికల కారణంగా వెనుకబాటు
ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఎక్కువ పన్నులు వసూలు అవుతాయి. ఈసారి మున్సిపాలిటీ ఎన్నికలు ఉండడంతో వీటిపై ప్రభావం పడింది. సిబ్బందికి ఎన్నికల సర్వేలు, ఇతర బాధ్యతలు అప్పగించడంతో ఆశించిన స్థాయిలో వసూలు కాలేదు. ఈ క్రమంలో బకాయిల కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నారు.
షాద్నగర్లో 53 శాతం
సుమారు 70 వేలకుపైగా జనాభా ఉన్న షాద్నగర్ మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉన్నాయి. 16,633 గృహ, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటి నుంచి సుమారు రూ.8.60 కోట్లు వసూలు కావాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు రూ.4.51 కోట్లు (సుమారు 53 శాతం) వసూలయ్యాయి. ఇంకా రూ.4.09 కోట్లు రావాల్సి ఉంది.
మొండి బకాయిలపై దృష్టి
మూర్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో వంద శాతం పన్నులు వసూలు చేసేందుకు మున్సిపల్ అధికారులు ఉపక్రమించారు. ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి వంద శాతం వసూలు లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ఇందుకు గాను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాళ్లు, పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, ఇంటి, నల్లా, ట్రేడ్ లైసెన్సుల పన్నులు వసూలు చేస్తున్నారు. మొండి బకాయిలపై దృష్టి సారించి బకాయిదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సిబ్బంది బకాయిదారుల ఇళ్లు, దుకాణాల వద్దకు వెళ్లి పన్నులు వసూలు చేస్తున్నారు.
● చేవెళ్ల మున్సిపల్లో రూ.3.05 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.2.17 కోట్లు (73 శాతం) వసూలయ్యాయి.
● మొయినాబాద్లో రూ.5 కోట్లకు గాను రూ.3 కోట్లు (60 శాతం) వసూలు చేశారు.
● శంకర్పల్లిలో రూ.5.74 కోట్లకు గాను రూ.2.34 కోట్లు (41 శాతం) వచ్చాయి.
● ఆమనగల్లులో రూ.2.22 కోట్లకు గాను రూ.79 లక్షలు (36 శాతం) వసూలయ్యాయి.
వందశాతం పన్నుల వసూలుపై అధికారుల నజర్
మార్చి 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం
గడువులోగా వందశాతం పూర్తి చేసేలా మున్సిపాలిటీల్లో చర్యలు
ప్రత్యేక బృందాలతో ఉరుకులుపరుగులు
ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు వందశాతం పన్నులు వసూలు చేస్తాం. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. పట్టణ ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి.
– సునీత, కమిషనర్, షాద్నగర్ మున్సిపాలిటీ
పట్టణాభివృద్ధికి పన్నులే కీలకం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి పన్నులు సకాలంలో చెల్లించాలి. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి.
– అగ్గునూరు బస్వం, మున్సిపల్ చైర్మన్, షాద్నగర్
కొత్తూరు మున్సిపాలిటీలో సుమారు 14వేల మంది జనాభా ఉన్నారు. ఇందులో 2,800 ఇళ్లు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి. వీటి నుంచి రూ.4.27 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.1.92 కోట్లు (సుమారు 45శాతం) మాత్రమే వసూలయ్యాయి. ఇంకా రూ.2.35 కోట్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
శతశాతం భవతి
శతశాతం భవతి


