విధులు వదిలి.. విందుకు తరలి!
● మధ్యాహ్నానికే తహసీల్దార్ కార్యాలయం ఖాళీ
● పడిగాపులుకాసిన ప్రజలు
బషీరాబాద్: తహసీల్దార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది విధులకు ఎగనామం పెట్టి విందుకు వెళ్లారు. గురువారం ఉదయం విధులకు వచ్చిన తహసీల్దార్ షాహేదాబేగం, డీటీ రుక్సాన బేగం, ఆర్ఐ సుధ, సర్వేయర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు మధ్యాహ్నం కార్యాలయానికి తాళం వేసి తాండూరులో ఓ విందుకు తరలివెళ్లారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు అధికారుల రాక కోసం సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. అధికారులు విందుకు వెళ్లిన విషయం తెలుసుకున్న ప్రజలకు వీరికి విధుల కంటే విందులకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శించారు. ఇదే విషయమై ఓ అధికారిని అడగగా తామంతా తాండూరులో ఓ వివాహానికి హాజరయ్యామని చెప్పారు.
భర్త మరణ ధ్రువీకరణపత్రం కోసం మూడు నెల ల క్రితం మీ సేవలో దరఖా స్తు చేసుకున్నా. వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఓ అధికారి వస్తే మరొకరు రావడం లేదు. గురువారం మధ్యాహ్నం 12.45కి కార్యాలయానికి వస్తే అంటెడర్ తప్పా ఎవరూ లేరు. సాయంత్రం 5 గంటల వరకు వేచి చూసి ఇంటికి వెళ్లా. – కవిత, బషీరాబాద్
రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం మధ్యాహ్నం తహసీల్దార్ కార్యాలయానికి వస్తే కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఒక్క అధికారి లేరు. ప్రతీ రోజు సాయంత్రం 3 గంటలకే వెళ్లిపోతున్నారు. సర్టిఫికెట్ల కోసం రోజుల తరుబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి.
– సాయప్ప, కాశీంపూర్


