సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
కొడంగల్: పట్టణ శివారు నుంచి ఎనికెపల్లి వెళ్లే దారిలో ఈనెల 24న ఉదయం 11 గంటలకు అక్షయ పాత్ర సెంట్రలైజ్డ్ కిచెన్ షెడ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి గురువారం కొడంగల్కు వచ్చి భూమి పూజ చేయాల్సిన స్థలాన్ని పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఎనికెపల్లి రోడ్డులో రెండు ఎకరాల విస్తీర్ణంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ కిచెన్ను నిర్మించనున్నారు. ఈ మేరకు అక్షయ పాత్ర ప్రతినిధులు సీఎంను కలిసి భూమి పూజకు ఆహ్వానించారు. ఇక్కడ వండిన భోజనాన్ని నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ కృషి చేయనుంది. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ రాంబాబు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
24న అక్షయ పాత్ర కిచెన్ షెడ్కు భూమి పూజ


