గురుకుల విద్యార్థుల అదృశ్యం
12 గంటల తర్వాత ఆచూకీ లభ్యం
● తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారం
● ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం
తాండూరు టౌన్: తాండూరు పట్టణం ఎన్టీఆర్ నగర్ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి కనపడకుండా పోయిన విషయాన్ని 9 గంటలకు తల్లిదండ్రులకు ఇన్చార్జి ప్రిన్సిపాల్ తెలియజేశారు. దీంతో ఆందోళనకు గురైన వారు గురుకులానికి చేరుకున్నారు. ఎట్టకేలకు 12 గంటల అనంతరం ఇద్దరు విద్యార్థులు మోమిన్పేట్లో కనిపించారు. ప్రిన్సిపాల్ అశోక్ తీరుపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్కు చెందిన గురుకుల పాఠశాల, కళాశాలను తాండూరు పట్టణంలోని నిర్వహిస్తున్నారు. ఇందులో కోట్పల్లి మండలం మోత్కుపల్లికి చెందిన హర్షవర్ధన్ 9వ తరగతి, వినయ్ 8వ తరగతి చదువుతున్నారు. వీరు స్కూల్ మైదానం నుంచి కనపడకుండా పోయారు. దీంతో సిబ్బంది ప్రిన్సిపాల్ అశోక్కు సమాచారం ఇచ్చారు. తాను జూమ్ మీటింగ్లో ఉన్నానని ఇన్చార్జి ప్రిన్సిపాల్కు చెప్పారు. దీంతో ఆయన తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిల్లలు గురుకులంలో లేరని ఇంటికి వచ్చారా అని అడిగారు. లేదని చెప్పారు. చాలా సేపటి వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గురుకులానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కానీ ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల విషయం గోప్యంగా ఉంచిన ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
మోమిన్పేట్లో ఆచూకీ లభ్యం
ఎట్టకేలకు 12 గంటల అనంతరం సాయంత్రం 6గంటలకు మోమిన్పేట్లోని ఓ బేకరీ వద్ద ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు పరిచయస్తుడు తల్లిదండ్రులకు సమాచారం చేరవేశాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఇంటిని తీసుకెళ్లారు.


