పిల్లలకు క్రమశిక్షణ బోధించండి
కొడంగల్ రూరల్: తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవాటు చేయాలని ప్రవచన కర్త, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు సూచించారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆధ్యాత్మిక ధార్మిక సేవా సమితి 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ప్రవచనాలు అందించారు. పది మంది ఏది చేస్తే అదే చేయడం మానుకోవాలని, అందులో ఎంత వరకు నిజమున్నదో ఆలోచించుకోవాలన్నారు. విషయ పరిజ్ఞానం తెలుసుకొని మసలుకోవాలని, ప్రతి మనిషిలో గుడి ఉందని, భగవంతుడి దర్శించుకునే క్రమంలో తొక్కిసలాటలకు వెళుతూ ప్రమాదాలకు గురికాకూడదన్నారు. ప్రభుత్వాలు అందించే ఉచితాలు నిరుపేదలకు అందించాలని, అవినీతి లేకుండా చేయడం ప్రభుత్వాల లక్ష్యంగా మారిన సమయంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. హిందూధర్మంలో భగవంతుడిని ఎన్నో రూపాల్లో కొలుస్తున్నామన్నారు. శివానుగ్రహంతో అన్ని విద్యలు ప్రాప్తిస్తాయని, గణనాథుడు తలపెట్టిన కార్యాలను సిద్ధించేందుకు పూజిస్తామన్నారు. నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చేయూతనివ్వాలన్నారు. భగవత్ ధ్యానంతో ఏదైనా సాధించవచ్చని, చెడు చూడకుండా తప్పుడు మాటలు మాట్లాడకుండా, చిత్తశుద్ధితో దైవారాధన చేయడంతో ఏదైనా సాధ్యమవుతుందన్నారు. నీతి నిజాయతీగా వ్యవహరించడం, సంస్కృతి సంప్రదాయాలను ఆచరించడం, సీ్త్రలను గౌరవించడంతో లక్ష్మీదేవి కటాక్షిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఆధ్యాత్మిక ధార్మిక సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు


